జీవో 46 ను తక్షణం రద్దు చేయాలి
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జాక్ భారీ నిరసన ర్యాలీ
రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
– బిసి జేఏసి ఛైర్మన్ ఆర్.క్రిష్ణయ్య
హైదరాబాద్, నవంబర్ 27, అద్దం న్యూస్ : జీవో 46 తక్షణం రద్దు చేయాలని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని బిసి జేఏసి ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానాలు చేసి 23 శాతానికి తగ్గించి అమలు చేసేటప్పుడు 17 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణా బీసీ జాక్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నిజాం కాలేజి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాది మందితో భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్, రాష్ట్ర బిసి యువజన సంఘం అధ్యక్షుడు అంజి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బిసి జేఏసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డెక్లరేషన్ లో హామీనిచ్చారని, ఎన్నికల తర్వాత అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు. రెండుసార్లు మంత్రివర్గంలో తీర్మానం చేసిందని, జనాభా లెక్కలు పూర్తి చేసిందని, చివరకు జీవో 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. పంచాయతీ రాజ్ సంస్థలలో బీసీలకు 42 శాత రిజర్వేషన్లు కల్పిస్తామని, కోట్ల కరపత్రాల ఎన్నికల మ్యానిఫెస్టోలో ముద్రించారన్నారు. ఆఖరకు 42 శాతం కల్పిస్తూ రాజ్యాంగబద్దంగా జీవో నెంబర్ 9 జారీ చేశారన్నారు. బీహార్ ఎన్నికలు ముగియగానే చడి చప్పుడు కాకుండా రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతం తగ్గిస్తూ మరో జీవో నెంబర్ 46 జారీ చేశారు. అమలు చేయడంలో 17 శాతం తగ్గించి తీవ్ర అవక-తవకలు పాల్పడ్డారన్నారు. జీఓ 46 కారణంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో, అనేక మండలాల్లో, గ్రామాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ లేదా వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని దాదాపు 1200 సర్పంచ్ పదవులు దక్కకుండా పోయాయన్నారు.
బిసి రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ తీరు-తెన్నులు అనుమాదాస్పదంగా ఉన్నాయని, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి తీసుకు వెళ్ళలేదన్నారు. లోక్ సభలో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారని, గత పార్లమెంటు సమావేశాలు బీహార్ ఓటర్ల విషయంలో నెల రోజులు పార్లమెంట్ బహిష్కరించారు…కానీ బీసీల విషయంలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదన్నారు. రిజర్వేషన్ల కేసు హై కోర్ట్ లో నడుస్తుందని, తీర్పు రాకముందే ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు. బిసి నాయకులు. జాతీయ బిసి సంక్షేమ సంఘం కో–ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, అనంతయ్య, బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్, యువజన సంఘం అధ్యక్షుడు అంజి గౌడ్, బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ, కన్వీనర్ నిఖిల్ పటేల్, బాలస్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply