అడ్మిషన్స్ కోసం వేసవిలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పై వేధింపులు ఆపాలి
– టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్
ఉస్మానియా యూనివర్శిటి, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : అడ్మిషన్స్ కోసం వేసవిలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పై వేధింపులు ఆపాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ ( టిపిటిఎల్ఎఫ్ ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విజయ్ కుమార్ మాట్లాడుతూ… వేసవిలో ప్రైవేట్ విద్యాసంస్థలు అందులో పని చేసే టీచింగ్ స్టాఫ్ను జూన్ లో ప్రారంభమయ్యే క్లాసుల కోసం ఇప్పటి నుంచే అడ్మిషన్ల కోసం క్యాంపెయిన్ చేయాలని ఒత్తిడి చేయడం అన్యాయని అన్నారు. క్యాంపెయిన్ చేసిన వారికి అదనపు డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంకా రవాణా సౌకర్యాలు కల్పించక పోవడం, ఎండకు వడదెబ్బ తగిలితే, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కూడా వేధించడం, కనీసం సహకరించకపోవడమే కాకుండా ఎండలో తిరగాలని, తిరగకపోతే బెదిరించడం చేస్తున్నారని ఆయన విద్యాసంస్థల తీరుని దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల చేరికతోనే నడుస్తాయనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
అయితే ఒక విద్యాసంస్థకు అక్కడి సాకర్యాలు, మేనేజ్మెంట్ నిర్వహణ, టీచర్స్ టీచింగ్ పద్ధతి లాంటి విషయాలు ప్రభావం చూపుతాయని, వీటిని పరిగణనలోకి తీసుకోకుండా టీచర్లనే బాధ్యులని చేసి, టార్గెట్స్ పెట్టి ఎర్రటి ఎండల్లో క్యాంపెయిన్లకు పంపడం ఏమిటని అన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా, ఎవరైనా వెళ్ళకున్నా, అడ్మిషన్లు తీసుకురాకున్నా జీతాలు నిలిపివేయడం, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం వంటివి విద్యా సంస్థ ఎదుగుదలకు ఆటంకంగా ఉంటాయని ఆయన అన్నారు. టీచర్స్, లెక్చరర్స్ సేల్స్ మ్యాన్ల లాగా, మార్కెటింగ్ ఏజెంట్ లాగా ట్రీట్ చేయడం, రోడ్ల మీద ఉపాధ్యాయులను తిప్పడం మంచిది కాదని, ఇది ఉపాధ్యాయ వృత్తినే అవమానించినట్లవుతుందని ఆయన తెలిపారు. దీనికి బదులుగా వేరే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచన చేశారు. వెంటనే ప్రభుత్వం, విద్యాశాఖ కూడా చొరవ చూపి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కి అండగా ఉండాలని, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.![]()

![]()












Leave a Reply