హైదరాబాద్ లో భారీ వర్షం
కూలిన చెట్లు… తెగిపడిన విద్యుత్ స్థంభాలు, వైర్లు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇద్దరు మృతి
హైదరాబాద్, జూన్ 9, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా వచ్చి చేరింది. నియోజకవర్గంలోని చిక్కడపల్లి, అశోక్ నగర్, కవాడిగూడ, బాపు నగర్, సూర్య నగర్ తదితర ప్రాంతాల్లో భారీ చెట్లు కూలిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దాంతోపాటు పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో వారి చెట్లు నేలకొరిగాయి. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పార్కింగ్ చేసి ఉన్న కార్లపై పడిపోయాయి. దీంతో కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వీలైనంత త్వరగా రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించాలని చిక్కడపల్లి మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు.
అపరిచితుడు సినిమా సీన్ రిపీట్ :
భారీ వర్షానికి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ సీ హోటల్ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడడంతో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అపరిచితుడు సినిమాలో వర్షానికి తెగిపడిపోయిన విద్యుత్ తీగలు నీటి పడి.. ఆ నీటిలో ప్రమాదవశాత్తూ పడి చిన్నారి ఎలాగైతే మృతి చెందిందో అలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం 25 ఏళ్ల జాఫర్, 16 ఏళ్ల అబూ ఆటోలో వచ్చి రాయల్ సీ హోటల్ వద్ద దిగారు. భారీ వర్షానికి పక్క స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై నిలిచిన నీటిలో పడిపోయాయి. నడుస్తూ వెళ్తున్న ఇద్దరు యువకుల ఆ నీటిలో పడి ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. దీంతో నీటిలో కాలు పెట్టిన వెంటనే ఇద్దరు యువకులు తీవ్ర కరెంట్ షాక్కు గురయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికి అప్పటికే జాఫర్ మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అబు మృతి చెందాడు.![]()

![]()












Leave a Reply