వర్షాకాలం ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై హైడ్రా – జీహెచ్ఎంసీ దృష్టి 🔷 హైడ్రా – జీహెచ్ఎంసీ కమిషనర్ల సమావేశం 🔷 రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు నివారణకు పరిష్కారంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు హైడ్రా, జిహెచ్ఎంసి కమిషనర్లు రంగనాథ్, కె.ఇలంబర్తి లు స్పష్టం చేశారు. వరద ముప్పుతో పాటు.. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా – జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, కె.ఇలంబర్తి మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం.. కల్వర్టులు, నాలాలు, క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నగరంలో వరద ముప్పు ఉన్న 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది.. వరద నివారణకు తీసుకున్న చర్యలపై ఇరువురు కమిషనర్లు సమీక్షించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించి వరద ముప్పుతోపాటు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో ఒక కమిటీ, వర్షాకాలంలో వరద ముప్పు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మరో కమిటీ వేయాలని కమిషనర్లు రంగనాథ్, కె.ఇలంబర్తి లు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్టుమెంట్తో పాటు.. హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఇరువురు కమిషనర్లు నిర్ణయించారు. అలాగే వర్షాకాలంలో వరద ముప్పు నివారణతో పాటు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడడానికి ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో కమిటీలు ప్రాంతాల వారీ వేయాలన్నారు. ఈ రెండు కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై.. సమన్వయంతో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని వారు సూచించారు. అగ్ని ప్రమాదాలు ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయని, ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా.. ఆయా ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతం నుంచే తనిఖీలు ప్రారంభించి.. వారిని అప్రమత్తం చేయాలన్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. వాటిని నివాసితులు, వాణిజ్య సముదాయాల యజమానులు పాటిస్తున్నారా.. అనేది తరచూ తనఖీలు చేయాల్సిన అవసరాన్ని కమిషనర్లు గుర్తు చేశారు. క్యాచ్మెంట్ ప్రాంతాలను గుర్తించి.. వరద నీరు దగ్గర్లో చెరువుకు చేరేలా చూడాలని సూచించారు. జోనల్ స్థాయి కమిటీలు అక్కడి సమస్యకు సమాధానం చెప్పేలా ఉండాలన్నారు. సమస్యపై పూర్తి అవగాహన ఉంటే.. పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడికక్కడ జవాబూదారి వ్యవస్థను రూపొందించినప్పుడే వరద ముప్పుతో పాటు.. అగ్ని ప్రమాదాలను నివారించగలమన్నారు.
Leave a Reply