ఆరె కటికల కోసం అసెంబ్లీలో మాట్లాడతా
• మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మార్చి 24, అద్దం న్యూస్ : ఆరె కటికల కోసం అసెంబ్లీలో మాట్లాడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి గజ్బిన్కార్ అశోక్ దాదా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి నందీశ్వర్ దాదా, కోశాధికారి దినేష్ దాదా, కోర్ కమిటీ సభ్యుడు గోపాల్ తదితరులు మంగళవారం మినిష్టర్స్ క్వాటర్స్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో ఆరెకటికలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బీసి ‘డి ‘నుండి బీ సీ ‘ఏ’ హోదా కల్పిస్తూ జిఓ తేవాలని, వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ తేవాలని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి గజ్బిన్కార్ అశోక్ దాదా ఆరె కటిక సమస్యలను మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల జనాభా సుమారు పది లక్షల పై మాటేనని అంచనా ఉందన్నారు. ప్రభుత్వానికి ఆరె కటికల 9 మేకల మండిలపై ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని, మేకల అంగళ్లపై ప్రభుత్వానికి ప్రతి ఏటా ప్రత్యక్షంగా పరోక్షంగా మటన్ వృత్తిపై ఆదాయం వస్తూనే ఉందన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఆరె కటిక కులానికి ఏ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని.. ఇది అన్యాయం అని అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానమిచ్చిన మిరియల్కర్ సునీల్ కుమార్ ఆరె కటికల బిడ్డ అని అన్నారు. 2020 నుండి 23 వరకు పది మంది మటన్ వృత్తిని సాగించలేక మటన్ షాపులలో ఉరి వేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం 2025 న ప్రకటన చేసిందని.. అందులో ఆరె కటిక కులం పేరు లేదని మంత్రికి అశోక్ వివరించారు. ఆరెకటిక కులం బిడ్డలు ఆత్మగౌరవంగా బతకాలంటే ప్రభుత్వం గుర్తించి వెంటనే 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, బీసీ డీ నుంచి బిసి ఏ హోదా కల్పిస్తూ జీఓ తేవాలని, ఆరె కటిక మహిళలకు కర్రీ పాయింట్లు ఏర్పాటు కోసం 90 శాతం సబ్సిడీతో ఐదు లక్షల రూపాయల బ్యాంకు ద్వారా రుణం ప్రభుత్వం ఇవ్వాలని, ఆరె కటికలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఆరె కటికల సమస్యలు, డిమాండ్ల విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అసెంబ్లీలో మాట్లాడుతానని హామీనిచ్చారు.














Leave a Reply