వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదా
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జులై 19, అద్దం న్యూస్ : గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో రవాణా వ్యవస్థ, ప్రజాజీవనం అతలాకుతలమైందని, సుమారు 6 గంటలకు పైగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు గడిపారు. లోతట్టు ప్రాంతాల కాలనీలలో ప్రజలు భయభ్రాంతులు చెంది కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నా కనీసం వారికి మేమున్నామని ధైర్యం చెప్పే ప్రభుత్వ యంత్రాంగం కరువైందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కనీసం వారిని పరామర్శించి ధైర్యం చెప్పడానికి ఎవరో రాకపోవడం విచారకరం. విపత్తు నిర్వహణ కమిటీని జిహెచ్ఎంసి నుండి హైడ్రాకు బదిలీ చేయడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందన్నారు. జిహెచ్ఎంసి చూస్తుందని హైడ్రా, హైడ్రా చూస్తుందని జిహెచ్ఎంసి వాళ్ళు ఎవరు స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ చివరికి ప్రజల్ని అనేక అవస్థలకు గురి చేశారని మండిపడ్డారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలో బాధ్యత రహితంగా ప్రవర్తించడం ఒకవైపు జనం కాపాడాలంటూ అర్ధనాదాలు పెడుతుంటే బతుకమ్మకుంటను తీర్చిదిద్దామంటూ హైడ్రా ఉత్సవాలు సంబరాలు జరుపుకోవడం చోద్యంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబునాయుడి పాలనలో కీర్లోస్కర్ కమిటీని రూపొందించి దాని ప్రకారము చర్యలు తీసుకోవడం జరిగిందని, కమిటి సూచనల మేరకు నాలాల పరిరక్షణ చేపట్టడం నాలాల పరిరక్షణకు రిటైనింగ్ వాల్స్ను ఏర్పాటు చేసి చేశారన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో నిరాశ్రయులైన వారికి తాత్కాలిక ఏర్పాటు చేయడం మొదలైన చర్యలు చేపట్టేవారని, పునరావాసం కల్పించే వారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్న ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంచేసిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిర్లోస్కర్ కమిటీ సూచనల మేరకు నాలాల పరిరక్షణ మొదలైన పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి దానికి హైడ్రా హైడ్రా అంటూ దాన్ని ముందు పెడుతూ హైడ్రాను ఒక రాజకీయ పార్టీ లాగా తయారు చేశారని అన్నారు. ఏదో సాధించామని ఉత్సవాలు చేసుకోవడం కాకుండా పేదవాడి ఇల్లు కూల్చిన నాడు ఎవరిని కాపాడారో.. ఎందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి ప్రత్యేక సిబ్బందిని పెట్టి జిహెచ్ఎంసిని నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. హైడ్రా వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజుగౌడ్, ఎస్.ప్రకాష్, పరుశురామ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply