ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలి – ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి అశోక్‌రెడ్డి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలి
– విద్యార్థులకు న్యాయం చేయకుండా బోర్డ్ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు
» ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి అశోక్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ :    ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలని, విద్యార్థులకు న్యాయం చేయకుండా బోర్డ్ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి అశోక్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా 300 మందికి పైగా ఇంటర్ స్టూడెంట్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. థియరీ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదన్నారు. కాగా ఈ ఏడాది నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకే హాల్ టికెట్లు పంపించేలా బోర్డు చర్యలు చేపట్టింది… కానీ ఇంతవరకు వారికి అందనేలేదన్నారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుమారు 300 మందికి పైగా విద్యార్థులకు ఇప్పటికీ హాల్ టికెట్లు జారీ కాలేదన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంలో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల తప్పులకు విద్యార్థులను బలి చేయడం సరికాదని, బాధ్యులైన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ త‌ర‌పున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, హాల్ టికెట్లు రాని విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించి.. వారు పరీక్షలు రాసేలా చూడాలని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో వారు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి వస్తుందని, ఇది వారి కెరీర్ పై ప్రభావం చూపుతుందన్నారు.

డిసెంబర్ నెలలోనే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు ముగిసిందని, ఈ అవకాశాన్ని కూడా కాలేజీలు వినియోగించుకోలేకపోయాయన్నారు. పరీక్షలకు సమయం దగ్గరపడుతున్నా హాల్ టికెట్లు జారీ చేయకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలను నిలదీస్తున్నారు.. అయితే, కాలేజీ యాజమాన్యాలు మాత్రం సాంకేతిక కారణాలు చూపి ఫీజులు ఇంటర్ బోర్డుకు చెల్లించలేకపోయామని చెబుతున్నాయన్నారు. వాస్తవానికి ఫీజుల బకాయిలు ఉండటం జూనియర్ కళాశాలలు అనుమతులు లేకపోవడం, అంతర్గత నిర్వహణ లోపాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. యాజమాన్యాలపై భారీ పెనాల్టీలు విధించినా పర్లేదు కానీ, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని వారు డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page