కెసిఆర్ ఒక్కడే తెలంగాణ తేలె
సకల జనుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది
– తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 18, ( అద్దం న్యూస్ ) : కెసిఆర్ ఒక్కడే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తేలేదని తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. సకల జనుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చింది… తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టే అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఉద్యమ మహాగర్జన జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ నరాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాగర్జనకు హాజరైన మోతే శోభన్రెడ్డి మాట్లాడుతూ… 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమాలు చేశారని, 1200 మందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకున్నారని, మరెంతో మంది అరెస్ట్ అయ్యారని, దెబ్బలు తిన్నారని అన్నారు. 2001 నుంచి కెసిఆర్ వెంట ఉండి అప్పటి టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన సమయంలో ఐదుగురిలో తాను ఒకరినన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను కెసిఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే తాను కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించిందన్నారు. అమరులైన కుటుంబాల్లో గత ప్రభుత్వం కేవలం 400 మంది కుటుంబాలనే ఆదుకుందని, మిగిలిన అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం, పది లక్షల నగదు, ఇళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్యమం సమయంలో చాలా మంది పై కేసులు బుక్ అయ్యాయని, బైండోవర్ అయ్యారని, అదే సమయంలో చాలా మంది పై ఎటువంటి కేసులు నమోదు కాకపోయినా వారందరిని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఉద్యమకారులకు సహాయం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 18 ఉద్యమ సంఘాలున్నాయని, వారందరితో ఒక్కో జేఏసి నుంచి ఇద్దరిని పిలిచి చర్చిస్తామన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమకారులందరిని గుర్తిస్తామన్నారు.
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఉద్యమకారుల్లో ఆశలు చిగురించాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు జీవితాంతం గుండెల్లో గూడు కట్టుకుంటారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కమిటీని కూడా వేయలేదని విమర్శించారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తే సీఎం రేవంత్రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల పరిస్థితి బాగాలేదన్నారు. వారిని గుర్తించేవారే లేరన్నారు. కొంత సమయం ఆలస్యమైన పరవాలేదు కానీ ఒక్క ఉద్యమకారునికి అన్యాయం జరుగవద్దన్నారు. ఈ ఉద్యమ మహాగర్జనలో తెలంగాణ ఉద్యమకారులు, వేదిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.














Leave a Reply