...

ఐ అండ్ పీఆర్ కమీషనరేట్‌ను ముట్టడించిన జ‌ర్న‌లిస్టులు

ఐ అండ్ పీఆర్ కమీషనరేట్‌ను ముట్టడించిన జ‌ర్న‌లిస్టులు
– జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్
వివక్ష విడనాడకపోతే రాష్ట్ర వ్యాపిత ఆందోళన
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

హైదరాబాద్, మార్చి 25, అద్దం న్యూస్ :   జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ( ఐ అండ్ పీఆర్ ) కమీషనర్ కార్యాలయం ( సమాచార భవన్ )ను ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐ అండ్ పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. 

ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ ను పూర్తిగా అణిచివేస్తున్నదని, గత రెండేళ్లుగా అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఆర్ఎన్ఐ, పీఆర్ జిఐ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న అనేక చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయడం లేదని, కనీసం ఆ పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో జర్నలిస్టులకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేదని, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా, నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేదని,హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసే లేదని, సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుకుంటుందని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తుండగా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వడంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వివక్ష చూపుతూ, నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జర్నలిస్టుల చైతన్య యాత్రతో ప్రజల్లోకి వెళతామని మామిడి సోమయ్య హెచ్చరించారు.

జై స్వరాజ్ పార్టీ అధినేత శ్రీనివాసరావు గౌడ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులను విస్మరించే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాలో ఫెడరేషన్ రాష్ట్ర కో–కన్వీనర్లు విజయకుమార్, జగన్, శ్రీనివాస్, బాపూరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జగదీశ్వర్, రామారావు, రాష్ట్ర నాయకులు పాండురంగారావు, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మనాభరావు, ఉమామహేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవి, కో–కన్వీనర్లు ఆర్.శ్రీనివాస్ గౌడ్, సంతోష్, బ్రహ్మం, మహిళా నాయకులు సాజిదా, మంజులారెడ్డి, శివపార్వతి, సుస్మిత, తీగవరపు శాంతి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ కిషోర్ బాబు కు అందజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.