కెసిఆర్ది రెండు నాల్కల దోరణి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ రజితోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని వ్యాఖ్యానించడం కెసిఆర్ రెండు నాల్కల దోరణికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. మంగళవారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… తెలుగుదేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక, ఆంధ్రపార్టీ, ఆంధ్రపార్టీ అని అబాసుపాలు చేసి అధికారం చేజిక్కించుకున్నావని కెసిఆర్ పై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాదు నగరం నడిబొడ్డున ఆవిర్భవించిందన్నారు. ఆవిర్భంచిన నాటి నుండి గత నలభై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం అప్రతిహతంగా ప్రజల కోసం పోరాడుతోందని, అభివృద్ధి సంక్షేమం ఎక్కడుంటుందో తెలుగుదేశం అక్కడ ఉంటుందని అన్నారు. కేవలం వాపును చూసి బలుపు అనుకోవద్దని అన్నారు. సభకు ప్రజల నుండి స్వచ్ఛందంగా వచ్చిన స్పందన కాదని… నిజంగా నీకు ప్రజల్లో అంతా బలమే ఉంటే గత ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యేవాడివి కాదన్నారు. నువ్వు చేసిన దౌర్భాగ్యమైన పనుల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించారని మాట్లాడే నువ్వు, చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమయ్యిందని ఉన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తే చంద్రబాబు ఇంట్లో నౌఖరుగా పడిఉంటామని అన్న కేసీఆర్, ఆయన అల్లుడు, కొడుకు, కూతురు మాట్లాడిన విషయం మర్చిపోవద్దని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే లెటర్ ఇచ్చారని సాయిబాబా గుర్తు చేశారు. హుందాగా ప్రవర్తించాలని, “ఏరు దాటే వరకు ఓడ మల్లన్న – ఏరు దాటాక బోడి మల్లన్న” చందంగా వ్యవహరించొద్దని, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. ఇష్టమొచ్చినటలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలేమీ అమాయకులు కారని అన్నారు. హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేసారు.
మీరు పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటు పడిందన్నారు. మీ లాంటి వాళ్లు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే చంద్రబాబు నాయుడు, ఎన్టి రామారావు పెట్టిన బిక్ష అని… కేసీఆర్, బిఆర్ఎస్ శ్రేణులు గుర్తించుకోవాలన్నారు. మీ పార్టీ పేరు టిఆర్ఎస్సా ? బిఆర్ఎస్సా ? ముందు నిర్ణయించుకోవాలని, ఒకడు టిఆర్ఎస్ అని, మరొకడు బిఆర్ఎస్ అని అయోమయంలో ఉన్నారన్నారు. టిఆర్ఎస్ కాదు, బిఆర్ఎస్ కాదు. ప్రజలు ఎప్పుడో మీకు విఆర్ఎస్ కట్ట బెట్టారని, వాలంటరీ రిటైర్డ్మెంట్ ఇచ్చి ప్రజలే ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. సభకు లక్షల మంది వచ్చారని, లక్షల మంది రావడం ప్రజాభిప్రాయం కాదని… ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇన్ని రోజులు కదలలేను, మెదల లేను అని ఇంట్లో కూర్చొని, మళ్లీ అధికారం పై యావతో నేనున్నా నంటూ గంతులేస్తున్నారని అన్నారు. ఇవన్నీ కట్టిపెట్టి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, టిడిపి నాయకులు ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply