ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయరాదు – రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయరాద‌ని రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓర్సు ఇంద్రసేనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ జ‌డ్జి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అధితిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి కొరతతో పంటలు కోతకు వచ్చే సమయానికి పంటలు ఎండిపోతున్నాయి, దీనితో రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నందున‌ తక్షణమే ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలన్నారు. డాక్ట‌ర్‌.స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి సరియైన గిట్టుబాటు ధరను ఇవ్వాల‌ని, పంటలకు బీమా కల్పించి నష్ట పరిహారం చెల్లించాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రభుత్వాలు కల్తీ విత్తనాల పరిశ్రమలపై ఉక్కుపాదం మోపి, కల్తీ విత్తనాల తయారీదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతుల నుండి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయరాదు, ఒకవేళ భూసేకరణ తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే భూసేకరణ చట్టం 2013 ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. హెచ్‌సియు భూములను తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెస‌ర్ వినాయకరెడ్డి, న్యాయవాది సరస్వతీ, రైతు సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి నరసింహ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లేష్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, వెంకటేష్, ప్రభానంద్, వివిధ రైతు సంఘం నాయకులు, ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page