ఎమ్మెల్సి కవిత దీక్ష అంతా నటన
– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సి కవిత చేపట్టిన దీక్ష అంతా ఒక నటన, డ్రామా అని ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజ గౌడ్ అన్నారు. లిక్కర్ స్కామ్ అంశాన్ని సైడ్ చేసేందుకే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సి కవిత బీసీలపై కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కై ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సి కవిత చేపట్టిన దీక్ష పై పత్రికా ప్రకటన ద్వారా తేజాగౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే జనగణనలో కులగణన చేసి దానిని అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేశారన్నారు. కెసిఆర్ పాలనలో సకలజనుల సర్వేలో లెక్కలను ఎందుకు బహిర్గతం చేయలేదో తెలుపాలన్నారు. తమ పాలనలో గుర్తుకురాని మహనీయులు అంబేద్కర్, జ్యోతిబా పూలే లు అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల మీ పాలనలో బీసీలను ఎప్పుడెప్పుడు అనగదొక్కాలని చూశారు తప్ప, బీసీలకు ఏ విధంగా న్యాయం చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవిత తన పై పడిన లిక్కర్ కేసు మరకను బీసీ నినాదంతో తొలగించుకోవాలని చూస్తే ప్రజలు అంత అమాయకులు కాదని హితువు పలికారు. 10 ఏళ్లల్లో అసెంబ్లీలో ఎందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. ఆ మహనీయులను రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం తప్ప మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీసీ, ఎస్సీ ,ఎస్టీలకు సముచిత న్యాయం జరుగుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి నడుం బిగించామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. కెసిఆర్ పాలనలో ధర్నాచౌక్ ను ఎత్తివేసిన ఘనత తమరిదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ధర్నాకు దిగారని ప్రశ్నించారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంది చాలని, వారి అభ్యున్నతి కోసం కలిసి పోరాటం చేయడానికి ముందుకు రావాలని తేజాగౌడ్ కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply