హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ : మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధి నుంచి వెంటనే తొలగించి మున్నూరుకాపులకు అప్పగించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్ రావు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కాచిగూడ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లి శ్రీనివాస్ రావు, పన్నాల విష్ణువర్ధన్, అమరం చంద్రశేఖర్, ఎలగందుల దేవేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ కొందరు తమ స్వలాభం కోసం మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి, ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖకు, ఎండోమెంట్ కమీషనర్ కు లేఖలు అందజేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యునిగా తొలగించబడిన ఆకుల పాండురంగరావు కొంత మందిని కలుపుకుని విద్యార్థి వసతి గృహానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మున్నూరుకాపు పేద విద్యార్థుల జీవితాల్లో మట్టికొట్టాలని చూస్తున్నారని, ఆలాంటి వారిపై త్వరలోనే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాం ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళితే ప్రతి ఏటా దాదాపు రూ.40 లక్షల వరకు ఆదాయం ఎండోమెంట్ కు వెళ్ళుతుందని, దీంతో మున్నూరుకాపు విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయో ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ బోర్డు అనుమతి లేకుండా పాండురంగారావు నేతృత్వంలో నడుస్తున్న కంప్యూటర్ సెంటర్ ను మూసివేయనున్నట్లు వారు తెలిపారు. ట్రస్ట్ బోర్డులో ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, అలా జరిగినట్లు ఎవరైనా రుజువు చేస్తే వెంటనే తాము తప్పుకుంటామని వారు పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు కు సంబందించిన ఒక్క రూపాయి కూడా మిస్ యూజ్ జరగలేదని, కావాలనే పనికట్టుకుని మున్నూరుకాపులను, ప్రభుత్వాన్ని, మంత్రులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న వారిపట్ల మున్నూరుకాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నూరుకాపు విద్యార్థుల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ట్రస్ట్ బోర్డు పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.












Leave a Reply