అరుణోదయ 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

అరుణోదయ 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ :    అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభల పోస్టర్స్‌ను హైద‌రాబాద్‌ విద్యానగర్ మార్క్స్ భవన్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ… 1974లో అరుణోదయ ఆవిర్భవించిన నుండి 52 వసంతాల సుదీర్ఘ పయనంలో ప్రజా సంస్కృతి కోసం, ప్రజా కళారూపాలతో కృషి చేసిందని తెలిపారు. పల్లె జనుల నుండి పురుడు పోసుకున్న ఒగ్గుకథ, బుర్రకథ, బ్యాలే, వీధి నాటకము, భాగోతం, జానపద కళారూపాలను తీసుకొని ప్రజా సమస్యలను మేలవించింద‌న్నారు. ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి చేసిందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ పల్లెపల్లెన అరుణోదయ ఆటపాటలతో కృషి చేసిందని, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కలిసి ఉన్న ప్రజల మధ్య, మత వైషమ్యాలు సృష్టించి, ప్రజా సంపదను పెట్టుబడిదారులకు అప్పగిస్తుందని ఆయన అన్నారు. ప్రజా సంపదను కొల్లగొట్టే శక్తులకు వ్యతిరేకంగా అరుణోదయ గళం, పోరాట ఆయుధంగా మారుతుందని అన్నారు.

అరుణోదయ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కోలా స్వప్న మాట్లాడుతూ … ప్రజల గొంతుకైనా అరుణోదయ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో జరుపుకుంటుందని, ప్రజా కవులు, కళాకారులు, మేధావులు అరుణోదయ రాష్ట్ర మహాసభలకు, అన్ని విధాల సహకరించాలని కోరారు. శ్రామిక వర్గాల ఉద్యమ స్వరమై సమ సమాజానికి సైరను ఊదే అరుణోదయ మహాసభలను ఈ నెల 10, 11 తేదీల్లో హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌రయ్య విజ్ఞాన‌కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల తెలంగాణ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ( అంజయ్య భవన్ ) నుంచి కళాకారుల ప్రదర్శన సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకొని అనంతరం బహిరంగ సభగా మారుతోందని వివ‌రించారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షుడు వేణు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్టు సతీష్ చందర్ హాజరు కానున్నారని తెలిపారు.

  ఈ నెల 11వ తేదీన మార్క్స్ భవన్‌లో రాష్ట్ర మహాసభల ప్రారంభోపన్యాసం ప్రొఫెసర్ కాశీం, వక్తలుగా ప్రొఫెసర్ వినయ్ బాబు, లెల్లే సురేష్, అంబిక, పాల్గొంటారని, మహాసభల సందర్భంగా సావనీరు ను అరుణోదయ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శులు నాగన్న రాయకృష్ణలు ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.కొండల్, అరుణోదయ జిల్లా నాయకులు చందు, నర్సింహ, నరేష్, ఆంజనేయులు, పరశురామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page