రక్షా బంధన్ పండుగ మాత్రమే కాదు కుటుంబ బంధాల పవిత్రమైన సాంప్రదాయం
– మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఆగస్టు 09, అద్దం న్యూస్ : ఈ రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మన కుటుంబ బంధాలను మరింత మెరుగుపరిచే పవిత్రమైన సాంప్రదాయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం ఘనంగా జరిగాయి. వారి కుటుంబ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులకు, శ్రేయోభిలాషులతో రక్షా బంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనవరాళ్లు జశోదర, వేదాంషి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు హాజరై బండారు దత్తాత్రేయకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… రక్షా బంధన్ పండుగ సోదరి సోదరుల ప్రేమ, ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీక అని, ఒక సోదరి తన సోదరునికి రాఖీ కట్టి తన సంతోషాన్ని పంచుకోగా సోదరుడు ఎల్లవేళలా తన సోదరికి అండగా ఉంటానని సంకల్పం తీసుకుంటాడని పేర్కొన్నారు. తన మనవరాళ్లు జశోదర, వేదాంషి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, శ్రేయోభిలాషులు నాకు రాఖీ కట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ కార్మికులు మన వీధుల్ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని, అటువంటి వారిని మన కుటుంబ సభ్యులుగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. తాను గతంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికై అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, వారి ఉద్యోగ భద్రత, పెన్షన్లు, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పరిధిని విస్తృతం చేసి పారదర్శకతతో ముందుకు తీసుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు.ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు, మన చుట్టు ఉన్నవారితో ప్రేమ, సహాయం, రక్షణ కోసం అందరం పాటు పడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సోదరీమణులు కూడా పాల్గొనడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply