అద్దం న్యూస్, వెబ్డెస్క్: నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదుపుతప్పిన కారు.. ఎదురుగా వస్తున్న బస్సుతో ఢీ
జాతీయ రహదారి 40పై ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల – బత్తలూరు గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి, డివైడర్ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఈ కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారందరినీ పోలీసులు వేరొక బస్సు ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు పంపించారు.
పోలీసుల విచారణ
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply