ఆర్టీసి జేఏసితో చర్చలు సఫలం

ఆర్టీసి జేఏసితో చర్చలు సఫలం
» డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల బృందంతో 15 గంట‌లు సాగిన‌ జేఏసి చ‌ర్చ‌లు
» నేటి నుంచి రోడ్డు ఎక్కనున్న ఆర్టీసి బ‌స్సులు

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGS RTC ) ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని, 2021 పే స్కేల్‌ను అమలు చేయాల‌ని, ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్టీసి జేఏసి గ‌త మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా స‌మ్మెకు దిగిన విష‌యం విధిత‌మే. స‌మ్మె కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుల రాక‌పోక‌లు నిలిచిపోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్, అధికారుల బృందం ఆర్టీసీ జేఎసి తో చర్చలు జరిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అంశాలపై చర్చించడం జరిగింది. 11 శాతం పిఆర్‌సి ఇవ్వాల‌ని, ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని, సంఘాల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని జేఏసి మంత్రుల‌తో స్ప‌ష్టం చేశారు.

దాదాపు 15 గంటల పాటు సాగిన ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ సుదీర్ఘంగా చ‌ర్చ‌ల అనంత‌రం జేఏసి డిమాండ్ల‌ను మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రజా పాలన ప్రభుత్వం వారి సమస్యల పై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించ‌డంతో పాటు ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీని ప్ర‌భుత్వం ప్రకటించింది. దీంతో ఆర్టీసి జేఏసి నాయ‌కులు స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. రేపు అన్ని డిపోల‌ల్లో ఆర్టీసీ కార్మికులు ఉత్సవాలు చేసుకోవాలని జేఏసి పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు ఆర్టీసి జేఏసి నాయ‌కులు ధన్యవాదాలు తెలియ‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page