...

సాయి ఈశ్వర్‌ చారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే – బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌.ర్యాగ అరుణ్‌ కుమార్

సాయి ఈశ్వర్‌ చారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి
స్థానిక ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ముందుకు వెళ్లాలి
– బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌.ర్యాగ అరుణ్‌ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 5, అద్దం న్యూస్ :   బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ 42 శాతాన్ని అమలు చేయకపోవడం వల్లే సాయి ఈశ్వర్‌ చారి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడ‌ని, ఇది ముమ్మాటికి ప్ర‌భుత్వ హ‌త్యే అని బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌.ర్యాగ అరుణ్‌ కుమార్ అన్నారు. ఒంటి మీద పెట్రోలు పోసుకొని ఆత్య‌హ‌త్య చేసుకున్న సాయి ఈశ్వ‌ర్ చారి కుటుంబ స‌భ్యుల‌ను గాంధీ ఆసుప‌త్రిలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌.ర్యాగ అరుణ్‌ కుమార్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌.ర్యాగ అరుణ్‌ కుమార్ మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే సాయి ఈశ్వర్‌ చారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన తల్లి గర్భ శోకాన్ని ఎవరు తీర్చగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలహీన వర్గాల యువత, విద్యార్థుల మరణాల పరంపర కొనసాగుతున్నాయని, ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇంకా ఎంత మంది తమ హక్కుల సాధన కోసం ప్రాణాలు తీసుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఆచరణలో పెట్టడం కనీస కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని హెచ్చరించారు. హక్కులు సాధించే వరకు అవిశ్రాంతంగా ఉద్యమిస్తామన్నారు.       

రాహుల్ గాంధీ సామాజిక న్యాయం ఎజెండా అంటే ఇదేనా అని విమర్శించారు. బీసీ హక్కుల సాధనకు ఢిల్లీ వేదికగా ఐక్య కార్యాచరణ చేపడుతున్నామని, ఏఐసీసీ కార్యాలయంను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు రావాలని, ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ వైస్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, బిసి సంక్షేమ సంఘం వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంకటేష్, సి.రాజేందర్, సతీష్, రాజు నేత, అనురాధ గౌడ్, జి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.