కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించండి
– గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని
ముషీరాబాద్, మే 19, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని పలు బస్తీల్లో, కాలనీల్లో గత రెండు మాసాలుగా మంచినీటి సరఫరాలో పూర్తిగా రంగు మారిన, కలుషిత నీరు సరఫరా అవుతుందని, ఆ సమస్యను పరిష్కరించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్తో కలిసి మంగళవారం నారాయణగూడ జలమండలి కార్యాలయంలో జిఎం శ్రీధర్ రెడ్డిని పావని కలిశారు. లో ప్రెషర్తో కూడిన మంచినీటి సరఫరా సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, ఇప్పుడు పచ్చటి రంగుతో పూర్తిగా మురికి నీరు కలిసిన కలుషిత నీరు సరఫరా అవుతుందని పావని జిఎం కు తెలిపారు. డివిజన్లోని అరుంధతినగర్ బస్తీ, సబర్మతినగర్, వివి గిరి నగర్, అన్నా నగర్, వాల్మీకి నగర్తో పాటు మరిన్ని ప్రాంతాల్లోనీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు. వెంటనే సమస్యపై ప్రత్యేక దృష్టి వహించి, కలుషిత నీటి సరఫరాతో పాటు మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ కార్పొరేటర్ పావని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన వాటర్వర్క్స్ జిఎం శ్రీధర్రెడ్డి తక్షణ చర్యల్లో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు.













Leave a Reply