గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి
తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు
హైదరాబాద్ బ్యూరో, జూలై 16, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లు పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రులకు అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరగోల చేతిలో ధరించి, వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాడ బోనాల ఉత్సవాల బుక్ లెట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల చెక్కును ఇరువురు మంత్రులు కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రథమ ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మధుయాష్కి గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, కాల్వ సుజాత, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు , జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.













Leave a Reply