తెలంగాణ బడ్జెట్లో ఉద్యమకారులను విస్మరించడం తగదు
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
కుషాయిగూడ, , మార్చి 21, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించడం వారి మనోభావాలను దెబ్బతీసే చర్య అని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి అన్నారు.
శనివారం కుషాయిగూడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమకారులు అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, బెదిరింపులు, అనేక కష్టాలను ఎదుర్కొంటూ పోరాడారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే రాష్ట్రం సాధ్యం కాదని, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమందికే లాభాలు చేకూరగా, ఉద్యమకారుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆయన అన్నారు.
వందలాది మంది ఉద్యమకారులు కేసుల పాలై ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్లో ఉద్యమకారులకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడం వారిని పూర్తిగా విస్మరించినట్టేనని విమర్శించారు. వెంటనే ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులు మాటలకే పరిమితమై ప్రలోభాలు చూపుతున్నారని, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికీ ఉద్యమకారుల సమస్యలపై చర్చ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

![]()

