ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత‌

ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది

– తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత‌

 

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు పడిందని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల బస్ భవన్ ముట్టడి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీగా మోహ‌రించి ఉన్న పోలీసులు క‌విత స‌హా ప‌లువురు జాగృతి నాయ‌కుల‌ను అరెస్ట్ చేసి చాంద్రాయ‌ణ‌గుట్ట పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని ధ్వ‌జ‌మెత్తారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంద‌న్నారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని విమ‌ర్శించారు. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ. 250 నుంచి రూ.350 వరకు భారం పడుతోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులపై ఈ విధమైన భారం ఏదీ విధించలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, మ‌రో వైపు బస్సులను పెంచక విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. మరో వైపు చార్జీలు పెంచి విద్యార్థులపై రేవంత్ స‌ర్కార్ ఆర్ధిక భారాన్ని మోపుతున్నార‌న్నారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page