తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి – ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్

 

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
♦ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్

సికింద్రాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ :   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఉద్యమ నేతలు, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్లు ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సీతాఫ‌ల్‌మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం సోమ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజర‌య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలు దశాబ్ద కాలం పాటు ఎన్నో ఉద్యమాలు చేసి సర్వం కోల్పోయారని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉద్యమకారుల కోసం పొందుపరిచిన అన్ని హామీలను జూన్ 2వ తేదీ లోపల అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేలు జరుగుతుందని ఉద్యమకారులు ఆశతో ఉన్నారని వారి డిమాండ్లను నెరవేర్చడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే వెంటనే అమలు జరిగే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్యామల హేమ, నాయ‌కులు మల్లూరి అనిల్, గగన్ కుమార్, జానకి రెడ్డి, దయానంద్, పుట్నాల కృష్ణ, జగన్, వీరస్వామి, కొండా స్వామి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page