శోభాయమనంగా శ్రీరాముడి శోభా యాత్ర
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన నగర కమిషనర్ సివి.ఆనంద్
అద్దం న్యూస్, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లోని మంగల్హాట్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. ప్రధాన ఊరేగింపులు మంగళ్హాట్, బేగం బజార్ ఛత్రి, సిద్దియాంబర్ బజార్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లీ బౌలీ చౌరస్తా, కోఠీ ఆంధ్రా బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయమశాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్, డిజి సివి.ఆనంద్ శోభాయాత్ర పై సరియైన ప్రణాళికతో, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం ఉదయం నుండి మొత్తం ఊరేగింపు మార్గాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ వారితో ఊరేగింపును ముందుగా ప్రారంభించే విధంగా వారిని ప్రోత్సహించారు. జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఐసీసీసీ భవనం, రోడ్ నెం. 12, హైదరాబాద్ నుండి ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, ఈఎంఆర్ఐ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీసు అధికారులు అందరూ కలిసి ఎప్పటికప్పుడు అన్ని ఊరేగింపులను నిశితంగా పరిశీలిస్తూ వారి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, డిజి సివి ఆనంద్ ప్రత్యక్షంగా డ్రోన్ ఫుటేజ్, సీసీటీవీ ఫీడ్ల ద్వారా పరిస్థితులను అంచనా వేస్తూ, రేడియో కమ్యూనికేషన్ల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించారు. సీనియర్ అధికారులు అడిషనల్ సిపి లా ఆండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయెల్ డెవిస్, ఇతర పోలీసు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఊరేగింపు సజావుగా సాగేలా చూశారు. హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభా యాత్ర ఊరేగింపు భద్రతా ఏర్పాట్ల కోసం సుమారు 20,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. శ్రీరామనవమి శోభా యాత్ర నిర్వాహకులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, భక్తులు, హైదరాబాదు నగర ప్రజల అందరి సహకారంతో ఊరేగింపు శాంతియుతంగా పూర్తయింది.












Leave a Reply