హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్నిఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని ముషీరాబాద్, హిమాయత్నగర్, ఉప్పల్ తహశిల్థార్లకు వినతి పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావొస్తున్నా ఉద్యమకారులకు న్యాయం చేయడంలేదన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని… కనీసం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి కనబడుటలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పోరాటానికైనా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. జూన్ 2 వ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రకటన రావాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రఫూల్ రాంరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర నాయకుడు చంద్రన్న ప్రసాద్, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసి వైస్ ఛైర్మన్ స్వరూప, లలిత, సుచరిత, రవి, హరి, కురుమయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply