పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును పొడిగించాలి
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ కార్డుల గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియడంతో కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ అయ్యేంత వరకు పాత కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా కనీసం నెల రోజులకు పొడిగించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత అక్రెడిటెషన్ కార్డుల చెల్లుబాటు గడువైతే ముగిసింది కానీ కొత్త కార్డులు మాత్రం ఇంతవరకు జారీ చేయలేదని, ఆరంభ శూరత్వంగా గురువారం హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొద్ది మంది జర్నలిస్టులకు మాత్రమే అందజేశారని, అంతే తప్ప రాష్ట్ర స్థాయిలో గానీ, జిల్లా, మండల స్థాయిలో గానీ ఇంకెవరికీ కార్డులివ్వలేదని సోమయ్య పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 10 వ తేదీ మధ్య అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలంటూ ఐఅండ్ పీఆర్ కొత్త కమీషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. కనీసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు కూడా ఇంత వరకు కార్డులివ్వలేదని, ఈ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం కారణంగా చాలా మంది జర్నలిస్టులు నేటికీ దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. కొత్త కార్డులు రాకముందే పాత కార్డుల చెల్లుబాటును నిలిపివేయడం సరైంది కాదని, దీనివల్ల జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం, ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త కార్డులు వచ్చేంత వరకు పాత కార్డులు చెల్లుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని మామిడి సోమయ్య కోరారు.












Leave a Reply