పసి బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
• ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా
హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ : పసి బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బిసి జేఏసి కన్వీనర్, ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులవివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం అమానుషమన్నారు. కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతరకు రజక వృత్తికి చెందిన గణేశ్, ఆయన భార్య మౌనిక, వారి రెండు నెలల పసిపాపతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారని తెలిపారు. ఈ జాతర ప్రాంగణంలో చోటుచేసుకున్న వాగ్వాదం కులవివక్ష రూపందాల్చి, కొందరు వ్యక్తులు ఆ కుటుంబంపై దాడికి దిగారన్నారు. పసిబిడ్డ ప్రాణం తీసేంత క్రూరత్వం సమాజంలో ఎలా పెరుగుతోంది ? ఇది కేవలం ఒక కుటుంబంపై దాడి కాదు, బీసీ సమాజ గౌరవం పై దాడి అని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన కేసులు నమోదు చేయకుండా, నామమాత్రపు సెక్షన్లతో కేసులు నమోదు చేసి వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని అశోక్ దాదా ధ్వజమెత్తారు. పసిపాప మృతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన కోరారు. ![]()

![]()












Leave a Reply