అద్దం న్యూస్, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో ఆహార ప్రియులకు, ముఖ్యంగా శాకాహారులకు అండగా నిలిచేలా వినియోగదారుల కమిషన్ ఒక సంచలన తీర్పునిచ్చింది. వెజ్ బిర్యానీ (Veg Biryani) ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు రావడంతో సంబంధిత రెస్టారెంట్, ఫుడ్ డెలివరీ యాప్కు రూ.55,000 జరిమానా విధించింది.
కర్నూలు నగరానికి చెందిన పోచా రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తి తన భార్య కోసం స్థానిక రెస్టారెంట్ నుండి ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వెజ్ బిర్యానీ (Veg Biryani) ఆర్డర్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన పార్శిల్లో చికెన్ ముక్కలు ఉండటంతో రాజశేఖర్రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తాను పూర్తి శాకాహారి అని, ఈ ఘటన తన మతపరమైన విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ ఆయన వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. సదరు యాప్ నిర్వాహకులు కూడా సరైన సమయంలో స్పందించకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్కుమార్, సభ్యులు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చారు. సేవా లోపానికి, వినియోగదారుడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గాను రూ.50,000 పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని రెస్టారెంట్, డెలివరీ యాప్ను (Delivery App) ఆదేశించారు. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించకపోతే 9 శాతం వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తీర్పు ఆహార భద్రత, వినియోగదారుల హక్కుల విషయంలో సంస్థలకు గట్టి హెచ్చరికగా నిలిచింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply