Bangladesh: మరో దారుణం..
అద్దం న్యూస్, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh)లో అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక హిందూ వితంతువుపై జరిగిన అమానవీయ దాడి నాగరిక సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కలిగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళ సుమారు రెండున్నరేళ్ల క్రితం షహిన్ అనే వ్యక్తి, అతని సోదరుడి నుంచి నివాసం కోసం కొంత భూమిని కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుండి నిందితుడు షహిన్ ఆమెను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. గత శనివారం సాయంత్రం బాధితురాలి ఇంటికి బంధువులు వచ్చిన సమయంలో, షహిన్ తన అనుచరుడు హసన్తో కలిసి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న బంధువులను భయపెట్టి అక్కడి నుంచి తరిమికొట్టారు. ఒంటరిగా ఉన్న మహిళపై నిందితులిద్దరూ అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అఘాయిత్యం తర్వాత ఆమెను డబ్బులు ఇవ్వాలని వేధించారు. ఆమె నిరాకరించడంతో మరింత కక్షగట్టారు. బాధితురాలిని బయటకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి ఆమె జుట్టును కత్తిరించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన మహిళను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కలిగంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనపై జరిగిన దాడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మైనారిటీలపై దాడులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి ఘటనల పట్ల భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
















Leave a Reply