బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సహకారం బలోపేతంలో బీఎంఎస్ ముఖ్యభూమిక
– మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, జులై 3, ( అద్దం న్యూస్ ) : కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సహకారాన్ని బలోపేతం చేయడంలో భారతీయ మజూర్ సంఘ్ ( బీఎంఎస్ ) ముఖ్య భూమిక పోషిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తున్న సందర్భంగా ఈ నెల 14 నుండి 16 వరకు హైదరాబాద్లో జరగనున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం ( TUF ) సమ్మిట్ ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్లోని భారతీయ మజ్దూర్ సంఘ్ ( BMS ) రాష్ట్ర కార్యాలయం తేంగడి భవన్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్ సచివాలయం ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ సెక్రటేరియేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర ఆర్థికాభివృద్ధి, బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల సహకారాన్ని బలోపేతం చేయడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ ద్వారా బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల మధ్య స్నేహబంధం, పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్–2026 చైర్మన్ సుంకరి మల్లేశం మాట్లాడుతూ… ఈ సమ్మిట్ ప్రపంచ కార్మిక రంగానికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించేందుకు ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యంగా భవిష్యత్ ఉద్యోగాలు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరివర్తన, వృత్తి భద్రత, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలిపారు. బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ… దేశంలో అతిపెద్ద కేంద్ర కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి రాంరెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సత్యజిత్రెడ్డి, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply