జస్టిస్ జి.చంద్రయ్య ఆకస్మిక మరణం పట్ల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం
హైదరాబాద్, మే 16, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయకోవిదులు జస్టిస్ జి.చంద్రయ్య ఆకస్మిక మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన మరణం న్యాయ రంగానికి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల సామాజిక న్యాయ పరిరక్షణకు తీరని లోటని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జస్టిస్ చంద్రయ్య నాకు అత్యంత ఆత్మీయులు అని, ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా, ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా హాజరయ్యేవారని, ముఖ్యంగా “ అలయ్ – బలయ్ ” కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఎంతో ఆప్యాయతతో విచ్చేసి అందరితో మమేకమయ్యేవారని తెలిపారు.
న్యాయమూర్తిగా ఆయన అందించిన సేవలు, ఇచ్చిన తీర్పులు ఎల్లప్పుడూ చట్ట పరిధిని దాటకుండానే మానవీయ విలువలకు, నిష్పాక్షికతకు అద్దం పట్టాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, క్షేత్రస్థాయిలో పర్యటించి సామాన్యుల హక్కుల రక్షణ కోసం ఆయన పడిన తపన ప్రశంసనీయమన్నారు. బలహీన వర్గాల, అణగారిన ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎనలేనిదన్నారు. అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికీ ఎంతో నిరాడంబరంగా, సరళంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని, ప్రజా హితం కోరి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు.













Leave a Reply