చంద్ర‌బాబు పై కెసిఆర్ విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

చంద్ర‌బాబు పై కెసిఆర్ విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దం
» టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    గత పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు అకస్మాత్తుగా నిద్రలేచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై సాయిబాబా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి దాకా నిద్రపోయి.. ఇప్పుడే గుర్తొచ్చిందా ? గత రెండేళ్లుగా మౌనంగా ఉండి, ఇప్పుడే ఏదో తన ఆస్తులు పోయినట్టు కేసీఆర్ ఆవురావురంటూ బయటకు రావడం చూస్తుంటే వింతగా ఉందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ వాదం పేరుతో ప్రజలను నమ్మించి, పదేళ్ల పాటు రెండుసార్లు అధికారాన్ని పొంది కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసారని ఆరోపించారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు వంతులు వేసుకుని తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల సంపదను దోచుకున్నారని అన్నారు.

           హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు చలవేనని, నాడు ఆయ‌న‌ నిర్మించిన హైటెక్ సిటీ, ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే నేడు తెలంగాణలో మిగులు బడ్జెట్ సాధ్యమైందని స్పష్టం చేశారు. ఆనాడు చంద్రబాబు కష్టపడి సంపాదించిన బడ్జెట్‌తోనే పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం జల్సా చేసిందని సాయిబాబా విమర్శించారు. దార్శనికుడైన చంద్రబాబు ముందుచూపును, ఎంఓయూలను విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని, చంద్రబాబు నాయుడు అభివృద్ధిని సహించలేక కేసీఆర్ అవాకులు చవాకులు పేలుతున్నారని, ఇది ఆయన నీచ మనస్తత్వానికి ఇది నిదర్శనమని అన్నారు. ” రాత్రికి బార్ – పొద్దున దర్బార్ ” అన్న చందంగా కేసీఆర్ పాలన సాగిందని, సంక్షేమం పేరుతో ప్రజలకు మసిపూసి మారేడు కాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో శిబు సోరెన్‌కు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌కు పడుతుందని, ప్రజలు ఇప్పటికే రెండుసార్లు ఓడించి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. నీళ్ల కోసం పోరాటం చేస్తానని, సభలు పెడతానని కేసీఆర్ చెబుతున్న మాటలు కేవలం డ్రామాలేనని అన్నారు. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేయవద్దని, ఇకనైనా వదురుబోతు మాటలు మానేసి సంస్కారంతో మెలగాలని సూచించారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి తన మీదనే పడుతుందని కేసీఆర్ తెలుసుకోవాలని హెచ్చరించారు. కెసిఆర్ – బిఆర్ఎస్ రెండు ఆరిపోయే ముందు వెలుగులా ఉన్నారని, తనకు తన కూతురుకు, తన దత్త పుత్రుడు ( జగన్ ) లకు ఇద్దరికి జైలుకు పోయే రోజులు దగ్గరకొచ్చినాయని, అందుకే ఎగురుతున్నావు అని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపించాలని నల్లెల్ల కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు పి.బాలరాజ్ గౌడ్, ఎస్ ప్రకాష్, కిరణ్, భాను ప్రకాష్, శక్తి ప్రేమ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page