స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
» పాత విధానం కొనసాగించాలని బిసి నేత ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష
హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : 14 లక్షల మంది విద్యార్ధుల స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ కు సంబంధించిన 8 వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీల వెంకటేష్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు మద్దుతుగా ఎమ్మెల్సి మధుసూదన చారి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. 96 బిసి కుల సంఘాలు, 40 బిసి సంఘ నేతలు మద్దతుగా దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే బీసీల తిరుగుబాటు తప్పదన్నారు. మంత్రివర్గంలో అన్యాయం, నామినేట్ పోస్టులలో అన్యాయం, బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త స్కీం కూడా బీసీలకు పెట్టలేదని ధ్వజమెత్తారు. పైగా కొనసాగుతున్న స్కీములను రద్దుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రుల హయంలో 50 సంవత్సరాలుగా పోరాటాలు చేశానని… ప్రతి ముఖ్యమంచి పోరాటాలకు స్పందించి కొత్త స్కీములు పెట్టారు… కాని రేవంత్ రెడ్డి ఉన్న స్కీములు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ స్కీముకు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే కూడా ఓర్వలేక పోతున్నారన్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కాకుండా 23 వేల ప్రభుత్వ పాఠశాలను రద్దు చేస్తామని బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, అలాగే ఎంతో ఉన్నత విద్య ప్రమాణాలతో బలహీన వర్గాల జీవితాల మాడు అభివృద్ధి చేస్తున్న బిసి, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను రద్దు చేసే కుట్రకు తెర తీస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సి మధుసూదన చారి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ… స్కాలర్షిప్లకు, ఫీజుల రియంబర్స్మెంట్కు బడ్జెట్ లేదని, అందుకే చెల్లించడం లేదని ముఖ్యమంత్రి విడిపడే అనడం సరికాదన్నారు. చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిపై ఫీజులకు బడ్జెట్ లేదా ! ఇది సరికాదన్నారు. వివిధ బ్యాంకుల నుంచి ఇతర సంస్థల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలను తెచ్చారని… దాదాపు 11 లక్షల కోట్లు ఆదాయం వస్తే చదువుకుని విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లకు, ఫీజుల రియంబర్స్మెంట్కు ఇవ్వడానికి డబ్బులు లేవా ? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పథకానికి ఏటా 2 వేల కోట్లు 50 లక్షలు సరిపోతాయని.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం బడ్జెట్ కేటాయించకుండా అటకెక్కిందని ధ్వజమెత్తారు. నేటికి దాదాదా రూ.8 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయేట్లు చేశారన్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సత్యాగ్రహ దీక్షలో బిసి కులాల ఐక్య వేదిక అధ్యక్షులు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిల్ల సతీష్, ఓయు బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిఖిల్ పటేల్, గుజ్జ కృష్ణ యాదవ్, నారగోని రవి బీసీ సంఘం నాయకులకు అఖిలపక్షం నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply