బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అలాట్మెంట్ చేయాలి
» గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జనవరి 29, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అలాట్మెంట్ చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివేకానందనగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేసి గురువారానికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బస్తీవాసులు నిరసన చేపట్టారు. బాధితులకు మద్దతుగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీలోని 19 మంది దళిత కుటుంబాల ఇళ్లను కూల్చి 2 సంవత్సరాలు పూర్తైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించలేదన్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ల ఆదేశాల మేరకు 2 సంవత్సరాలుగా అనేక సార్లు జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, ఎంఆర్ఓ తదితర అధికారుల చుట్టూ తిరిగినా కూడా రేపు మాపు అని మాట దాటివేస్తున్నారని అన్నారు. బాధితులకు న్యాయం చేస్తూ ఇళ్లను కేటాయించడం లేదని అన్నారు. రేపు రాబోయే ఫిబ్రవరి 5 వ లోపు బాధితులకు న్యాయం చేసే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అలాట్మెంట్ చేయాలని, లేదంటే మంత్రి ఇంటితో పాటు కలెక్టర్, ఆర్డిఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను బస్తీ వాసులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నేతలు అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి సంతోష్, తరుణ్, డేవిడ్, బస్తీ వాసులు ఎన్ఆర్.యాదగిరి, శ్యామ్ సుందర్, జ్ఞానేష్, ఆనంద్ రావు, సాయి కిరణ్, మున్న, మనోహర్, అన్నపూర్ణ, చంద్రకళ, సుశీల తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply