హైదరాబాద్, అద్దం న్యూస్ : పిల్లల్లారా జాగ్రత్తగా ఉండండి.. డ్రగ్స్, మతం.. మత్తు చాలా ప్రమాదకరమనీ, వాటి మత్తులో పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని సినీ నటులు అజయ్ ఘోష్ హెచ్చరించారు. మంచి పుస్తకాలు చదవాలని, చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యువజన, సాంస్కృతిక, టూరిజం శాఖల సహకారంతో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నిర్వహించిన భగత్సింగ్ యువజన క్రీడోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అజయ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సాంస్కృతిక కార్య్రకమాలతో సభను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ..సే టూ నో డ్రగ్స్ నినాదంతో యువతను చైతన్యపరస్తున్న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలను అభినందించారు. నేటి సమాజంలో మనుషులం మనుషులమని మరిచిపోతుండటం, కుటుంబ బాంధ్యవాలు చెల్లాచెదురుకావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మన గురించి మనం ఆలోచించుకునే స్థితిలో కూడా లేమనీ, పాలకులు కావాల్సినది అదేనని చెప్పారు. చరిత్రను ఎవరికి వారు మార్చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని, ఏ పోరాటంలోనూ పాల్గొనని వాళ్లు కూడా తాము దేశ భక్తులమని, మిగతావారు దేశద్రోహులని యువత మెదళ్లలో విషం నింపుతున్నారని విమర్శించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు అర్పించిన మహనీయుల చరిత్రలు చదివితే ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేలుతుందన్నారు. ప్రతి విద్యార్థి పుస్తకంలో రోజుకు కనీసం రెండు పేజీల చదవాలనీ, చదివితే ఆలోచించే తత్త్వం పెరుగుతుందని సూచించారు. చరిత్ర తెలుసుకుంటే డేంజర్ అనే యువతను అటువైపు వెళ్లకుండా కొందరు కులం, మతం మత్తులో యువతను దింపుతున్నారని ఆరోపించారు. హెరాయిన్, డ్రగ్స్ కంటే మతం మత్తు ఇంకా ప్రమాదకరమైందని హెచ్చరించారు. దేవుని పేరుతో కొందరు మోసాలు చేయడం, దురాగతాలకు పాల్పడటం, నయవంచనకు పాల్పడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వారు ముందు పడకపోతే దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరనీ, నిజంగా రక్షించే శక్తి ఎర్రజెండాకే ఉందని అభిప్రాయపడ్డారు.











Leave a Reply