కోటి 60 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన
– పోటా పోటీగా నినాదాలు చేసిన బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు
హైదరాబాద్, ఆగస్టు 10, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం సాగర్లాల్ ఆసుపత్రి చౌరస్తా నుంచి దయారా మార్కెట్ వరకు కోటి 60 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమం గందరగోళంగా మారింది. నేతల పరస్పర నినాదాలు, తోపులాటతో గందరగోళంగా మారింది. సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నగర ఇన్చార్జ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ప్రారంభోత్సవ స్థలానికి ప్రజా ప్రతినిధులు చేరుకునే సమయంలో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రారంభోత్సవ వేదిక వద్ద గందరగోళంగా మారింది. ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుసుకున్న బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. అప్పటికే మూడు పార్టీల నేతలు భారత్ మాతాకి జై, సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, సీఐ రాంబాబు, ఎస్ఐ లు నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి ఏ ఒక్కరూ వినిపించుకోకుండా వేదిక వద్దకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఓ సందర్భంలో పోలీసులు వారిని వెనక్కు నెట్టేసారు. దీంతో కొంత మంది నేతలు పోలీసులతో వాగ్వివాదానికి సైతం దిగారు. ఈ పరిణామాలను గమనించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లు కార్యకర్తలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్న వారిని వారించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెంటనే వేదిక వద్ద నుంచి వారు హడావిడిగా వెళ్లిపోయారు.
నిధుల కొరత లేకుండా చూడాలి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్ నగరంలో చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలంటే నిధులు అవసరమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సిసి రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ…. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని, భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను మరమ్మతులు చేయించాలన్నారు.
వరద నీటి నాలాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన సిసి రోడ్డు శంకుస్థాపనకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ… వరద నీటి నాలాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొ న్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. నగరంలో అవసరమైన ప్రతి చోట వెంటనే నూతన రోడ్లు వేస్తున్నామని తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను ఆధునీకరించేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రోడ్డు కోసం పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
సిసి రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… రోడ్డును పునర్ నిర్మించా లని జీహెఎంసీ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. రోడ్డు పనులు పూర్తి అయితే ప్రజల రాకపోకలకు, స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నా రు. ఈ కార్యక్రంలో జిహెచ్ఎంసి అధికారులు గీత, విశేష్ నాయక్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్, బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించాలి : బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పరకాల రజినికాంత్ గౌడ్
సాగర్లాల్ ఆసుపత్రి నుంచి దయారా మార్కెట్ వరకు కోటి 60 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు పనుల శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉందని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పరకాల రజినికాంత్ గౌడ్ ″ అద్దం న్యూస్ ″ ప్రతినిధితో తెలిపారు. ఈ రోడ్డు బాగాలేదని అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశామని, పత్రికల్లో వార్తా కథనాలు రాయించానని తెలిపారు. ఎట్టకేలకు సిసి రోడ్డు పనులు ప్రారంభం అయిందని, సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రామాణాలను పాటించాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply