క్రికెట్ను వదిలేద్దామనుకున్నా : Rohit Sharma
అద్దం న్యూస్, వెబ్డెస్క్ : గురుగ్రామ్లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి హిట్మ్యాన్ రోహిత్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ‘హిట్మ్యాన్’ను సత్కరించారు. అనంతరం రోహిత్ 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడాడు. 2023 వరల్డ్ కప్లో భారత్ అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా భారత ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ ఫైనల్లో ఓటమితో తీవ్రంగా కుంగిపోయానని, క్రికెట్ను పూర్తిగా వదిలేద్దామనే ఆలోచన తన మనసులోకి వచ్చిందని అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఎమోషనల్ అయ్యాడు.
‘అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏం జరిగిందో నమ్మలేకపోయాం. ఇది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం. ఎందుకంటే నేను ఆ ప్రపంచకప్ కోసం కేవలం రెండు లేదా మూడు నెలల ముందు కాకుండా 2022లో కెప్టెన్సీని చేపట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా. నా ఏకైక లక్ష్యం వరల్డ్ కప్ గెలవడం. అది టీ20 ప్రపంచకప్ అయినా, లేదా 2023 ప్రపంచకప్. అది సాధ్యం కాకపోవడంతో నేను పూర్తిగా కుంగిపోయాను. నా శరీరంలో ఎలాంటి శక్తి మిగలలేదు. కోలుకుని తిరిగి సాధారణ స్థితికి రావడానికి రెండు నెలల సమయం పట్టింది. ఎంతో కష్టపడి పని చేసినా ఫలితం రాకపోతే అలాంటి భావోద్వేగాలు రావడం సహజమే.
ఒకానొక దశలో క్రికెట్ను పూర్తిగా వదిలేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ ఆట నా నుంచి అన్నీ తీసుకుపోయిందని అనిపించింది. కానీ, జీవితం ఇక్కడితో ముగియదని నాకు తెలుసు. 2024 టీ20 ప్రపంచకప్ ముందుందని గుర్తు చేసుకున్నా. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ ఉత్సాహం వచ్చింది. క్రమంగా ఫోకస్ మొత్తం టీ20 ప్రపంచ కప్పై పెట్టాను’ అని రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. తర్వాత హిట్మ్యాన్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply