IND Vs SA: టీ20 సిరీస్‌ నేటి నుంచే.. పైచేయి ఎవరిదో..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: IND Vs SA మధ్య జరగనున్న టీ20 పోరులో నెగ్గేదెవరు? ఈ సిరీస్‌ను గెలుచుకుని మొత్తంగా భారత పర్యటనలో పైచేయి సాధించిన సంతృప్తితో స్వదేశానికి వెళ్లాలని చూస్తోంది దక్షిణాఫ్రికా. వన్డే సిరీస్‌ గెలిచిన ఊపులో టీ20ల్లోనూ నెగ్గి.. టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్‌ పరాభవానికి గట్టి బదులివ్వాలని భారత జట్టుంది.

వన్డే సిరీస్‌లో సిరీస్‌ విజయానికి తోడు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల మెరుపులూ అభిమానులకు ఫుల్ జోష్‌ను ఇచ్చింది. గత ఏడాది దక్షిణాఫ్రికాను దాని సొంతగడ్డపై ఓడించి సిరీస్‌ సాధించిన సూర్యకుమార్‌ సేన.. సొంతగడ్డపైనా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటోంది. గాయాల నుంచి కోలుకున్న వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనం చేయబోతుండడం భారత్‌కు కలిసొచ్చేదే. టెస్టులు, వన్డేల్లో దక్షిణాఫ్రికా ప్రదర్శనను బట్టి చూస్తే.. టీ20ల్లో ఆ జట్టు అంత తేలిగ్గా లొంగకపోవచ్చు. కాబట్టి సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.

టీ20 జట్టులో వీరిలా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆటగాడంటే అభిషేక్‌ శర్మనే. తొలి బంతి నుంచి విధ్వంసకంగా ఆడే అతను.. టీ20 జట్టులో భారత అభిమానుల ఫేవరెట్‌గా మారిపోయాడు. ఆసియా కప్‌లో, ఆపై ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన అభిషేక్‌.. తాజాగా దేశవాళీ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ అదరగొట్టాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభాలందిస్తాడని జట్టు ఆశిస్తోంది.

ఆసియా కప్‌లో గాయపడి రెండు నెలలకు పైగా ఆటకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ముస్తాక్‌ అలీలో అతనూ రాణించాడు. వీరికి తోడు కెప్టెన్‌ సూర్యకుమార్, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్, ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో తిలక్‌ వర్మ, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబెలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో ఆడని బుమ్రా.. టీ20ల్లో బరిలోకి దిగుతున్నాడు. అతడితో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొత్త బంతిని పంచుకుంటాడు.

బ్యాటింగ్‌లో సౌతాఫ్రికా జట్టు భారత్‌కు దీటుగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం సఫారీ జట్టు కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్‌ రబాడ గాయంతో మొత్తంగా భారత పర్యటనకు దూరంగా కావడం ఆ జట్టుకు ప్రతికూలమైంది. యాన్సెన్, బోష్‌లకు తోడు నోకియా, ఎంగిడిల్లో ఒకరు పేస్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. వీరు భారత బ్యాటర్లకు కళ్లెం వేయడం కష్టమే. స్పిన్నర్లు జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌ స్పిన్‌కు సహకరించే కటక్‌ పిచ్‌ను ఏమేర ఉపయోగించుకుంటారో చూడాలి.

పిచ్, వాతావరణం?

బారాబటి స్టేడియం పిచ్‌ సమతూకంతో ఉంటుంది. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు సహకారం అందుతుంది. ఇక్కడ పరుగులు బాగానే వస్తాయి. అయితే ప్రస్తుతం మంచు ప్రభావం వల్ల ఆట సాగేకొద్దీ బౌలర్లకు కష్టమవుతుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌/వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌.

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డివాల్డ్‌ బ్రెవిస్, ట్రిస్టన్‌ స్టబ్స్, డేవిడ్‌ మిల్లర్, జార్జ్‌ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్‌ బోష్, కేశవ్‌ మహరాజ్, నోకియా/ఎంగిడి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page