హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు,అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన దివంగత సీనియర్ జర్నలిస్టు యడ్లపల్లి నాగరాజు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి సోమయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య ఆరోగ్య సదుపాయం కల్పిస్తూ హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆర్థిక,ఆరోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఫలితంగా అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక,ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఏళ్ళ తరబడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వకపోవడం, సరైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఎంతో మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో మరణించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో నాగరాజు లాంటి జర్నలిస్టులు వందల సంఖ్యలో చనిపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి నూతన పాలసీ తీసుకువచ్చి సంక్షేమ చర్యలు చేపట్టాలని సోమయ్య డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో సీనియర్ జర్నలిస్టులు ఉప్పు సత్యనారాయణ, జే.పద్మారావు, మోహన్ రావు, జగన్ రెడ్డి, యుగంధర్, బాలకృష్ణ, రమేష్, జీహెచ్జె హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ యర్రమిల్లి రామారావు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.పాండురంగారావు, ఫోటో జర్నలిస్టులు శ్రీధర్, పర్వతాలు తదితరులు పాల్గొని దివంగత నాగరాజుకు నివాళులర్పించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply