అద్దం న్యూస్, వెబ్డెస్క్: తల్లి పాలు బిడ్డకు అమృతం అంటారు. అయితే, ఇటీవల నేచర్ జర్నల్లో ప్రచురించిన ఓ కొత్త అధ్యయనం ‘తల్లిపాల’లో ప్రమాదకరమైన అంశం ఉన్నట్లు వెల్లడించి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీహార్లోని ఆరు జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది బాలింతల తల్లి పాల నమూనాలలో యురేనియం (Uranium) (U-238) ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయంపై హడావుడి జరిగినప్పటికీ, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇచ్చిన స్పష్టత తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది.
అధ్యయనంలో బయటపడిన సంచలన నిజాలు..
పరిశోధించిన అన్ని నమూనాలలో యురేనియం (Uranium) (U-238) కనుగొన్నారు. దీని గాఢత 0 నుంచి 5.25 మైక్రోగ్రాములు, లీటరు మధ్య నమోదైంది. దాదాపు 70శాతం శిశువులలో యురేనియం ప్రభావం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉండవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా బీహార్ లోని ఖగారియా జిల్లాలో యురేనియం సగటు స్థాయి అత్యధికంగా ఉండగా, కటిహార్లో ఒకే నమూనాలో అత్యధిక గాఢత నమోదైంది.
మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ అండ్ ఏయిమ్స్ (AIIMS), న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు ఈ పరిస్థితిపై స్పందిస్తూ, తల్లి పాలలో యురేనియం ఉనికి ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) త్రాగునీటిలో యురేనియం కోసం నిర్దేశించిన పరిమితి 30 మైక్రోగ్రాములు/లీటరు. తల్లి పాల నమూనాలలో లభించిన స్థాయి (గరిష్టంగా 5.25 మైక్రోగ్రాములు/లీటరు) ఈ WHO ప్రమాణం కంటే చాలా తక్కువగా ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం, తల్లి శరీరంలోకి చేరిన యురేనియంలో ఎక్కువ భాగం మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతుంది. తల్లి పాలల్లోకి చేరే యురేనియం శాతం చాలా తక్కువగా ఉంటుంది.
బెస్ట్ న్యూట్రిషన్ బ్రెస్ట్ మిల్క్..
డాక్టర్లు, పరిశోధకులు స్పష్టంగా చెప్పిన సలహా ఏమిటంటే: “తల్లిపాలు శిశువులకు అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన పోషకాహారం. వైద్యపరమైన సూచన లేనిదే ఎట్టిపరిస్థితుల్లోనూ తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదు.”
యురేనియం మూలం ఏమిటి..?
యురేనియం భూగర్భ జలాలలో (Groundwater) సహజంగా ఉంటుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల ఇది ఆహార గొలుసులోకి (Food Chain) చేరుకునే అవకాశం ఉంది. దీని ఖచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) పరిశోధనలు చేస్తోంది. తల్లి పాలల్లో యురేనియం ఉన్నప్పటికీ, దాని స్థాయిలు చాలా తక్కువగా ఉన్నందున శిశువులకు నిజమైన ఆరోగ్య ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలు శిశువుల ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి అత్యంత కీలకం కాబట్టి, పాలివ్వడం కొనసాగించమని డాక్టర్లు గట్టిగా సూచిస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply