బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుడిని హత్య చేసిన అక్కాచెల్లెళ్లు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పెళ్లి సంబంధం చెడగొట్టడంతో పాటు ఫోన్‌లోని వీడియోలు చూపుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌(32) హైదరాబాద్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె అక్కతోనూ పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం రాగా మహేందర్‌ తన సెల్‌ఫోన్‌లో ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను చూపి చెడగొట్టాడు.

 

బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న అతడిపై అక్కాచెల్లెళ్లు పగ పెంచుకున్నారు. పథకం ప్రకారం యువతి శుక్రవారం మహేందర్‌కు ఫోన్‌ చేసి తన అక్క గ్రామానికి రమ్మని చెప్పగా వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కాచెల్ల్లెళ్లు అతడితో వాగ్వాదానికి దిగారు. పథకం ప్రకారం మహేందర్‌ కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. అక్కడే ఉన్న అక్క కుమారుడు, బంధువు, మరో వ్యక్తి కర్రలతో తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలతో మహేందర్‌ ఇంటి ముందు రక్తం మడుగులో పడిపోయాడు. స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జగిత్యాల రూరల్‌ ఎస్సై ఉమాసాగర్, సీఐ సుధాకర్‌ ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ సుధాకర్‌ తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ కేసును పర్యవేక్షిస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page